China New Virus: సరిగ్గా ఐదేళ్ల క్రితం కరోనా అనే మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. చైనాలో మొదలై మెల్లిగా భారత్తో పాటు అన్ని దేశాలకూ పాకేసింది. కొన్ని లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. అసలు వర్క్ ఫ్రం హోం.. లాక్ డౌన్ అంటే ఏంటో కూడా తెలీని మనకు ఆ రెండింటినీ పరిచయం చేసి హడలుగొట్టేసింది. అయినవారిని దూరం చేసేసింది. ఎంతో మంది నోటి దగ్గర కూడు లాగేసింది. ఉద్యోగాలు లేక… వ్యాపారాలు జరగక రోడ్డున పడిన వారు కోకొల్లలు. కరోనా సమయంలో బాగుపడిన వారు కూడా చాలా మందే ఉన్నారు. అలాగని ఆ మహమ్మారి గురించి తలుచుకుని సంతోషించలేం కదా. దానిని తలుచుకున్నప్పుడల్లా ఒంట్లో వణుకు పడుతుందే తప్ప మరో ఆలోచన రాదు. మూడేళ్ల క్రితమే కరోనా మెల్లిగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు దాని గురించి ఎక్కడా ఊసే లేదు అనుకుంటుండగా.. చైనా మరో బాంబు పేల్చింది. 2025 సంవత్సరం మొదలవగానే చైనాలో కొత్త వైరల్ వెలుగులోకి వచ్చింది. చైనాలో చాలా మంది ఫ్లూతో బాధపడుతూ శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందంటూ హాస్పిటల్స్లో చేరుతున్నారట. దీనిని హ్యూమన్ మెటా న్యుమో వైరస్ అంటున్నారు.
అసలేంటీ వైరస్?
ఈ హ్యూమన్ మెటా న్యుమో వైరస్ అనేది ఊపిరితిత్తుల్లో వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల సోకుతుంది. ఇది సోకిందంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. దీనిని 2001లోనే కనిపెట్టారు. దగ్గు, జలుబు వంటి లక్షణాలతో ఈ వైరస్ మొదలవుతుంది. సాధారణ దగ్గే అయ్యుంటుందిలే అని వదిలేస్తే ఊపిరితిత్తుల్లో ముదిరిపోయి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. ఈ వైరస్ సోకినప్పుడు సాధారణ దగ్గు, జలుబు అని వదిలేస్తే.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు.. నోటి నుంచి ఒక రకంగా విజిల్స్ వేస్తున్నట్లు సౌండ్స్ వస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు ఉంటే అది కచ్చితంగా వైరసే అని గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించాలి. చిన్న పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి లోపించినవారిలో ఈ వైరస్ ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. (China New Virus)
చైనా మళ్లీ తప్పు చేస్తోంది
కరోనా వైరస్ చైనాకి చెందిన వుహాన్ ల్యాబ్ నుంచే పుట్టుకొచ్చిందని అమెరికా వంటి దేశాలు ఆరోపించినప్పటికీ.. చైనా మాత్రం అబ్బే మా నుంచి కాదు అని అబద్ధాలు చెప్పింది. చాలా దేశాలు చైనాను నిందిస్తుంటే ఈ సమయంలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం కంటే ఈ మహమ్మారి నుంచి ఎలా ప్రజలకు కాపాడుకోవాలో సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా సూక్తులు చెప్పింది. ఇప్పుడు చైనా మళ్లీ అదే తప్పు చేస్తోంది. కొత్త వైరస్ వచ్చిందని.. చైనాలో హాస్పిటల్స్ రోగులతో నిండిపోతున్నారని ఓ పక్క వార్తలు వస్తుంటే చైనా మాత్రం దీనిపై నోరు విప్పడం లేదు. అసలు ఆ వైరస్ ఏంటి.. ఎలాంటి లక్షణాలతో పేషెంట్లు హాస్పిటల్స్కి వస్తున్నారు.. వారి పరిస్థితి ఎలా ఉంది.. ఈ వైరస్ కరోలా లాంటిదేనా వంటి కీలక అంశాలపై ఎలాంటి అధికారిక ప్రకటనలు కానీ సమాచారం కానీ ఇవ్వడంలేదు. చైనాకి ఇలాంటి విషయాలు దాచిపెట్టడం వెన్నెతో పెట్టిన విద్య. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిపై మౌనంగానే ఉందంటే ఆశ్చర్యం వేస్తోంది.
ఇండియాపై ప్రభావం ఎంత?
ప్రస్తుతానికి ఇండియాలో అయితే ఎలాంటి కొత్త వైరస్ కేసులు లేవు. కానీ ఆల్రెడీ చైనాలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోందని వార్తలు వస్తున్నాయి కాబట్టి భారత ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటే మరో కరోనా మహమ్మారి బారిన పడకుండా తప్పించుకుంటాం. ముఖ్యంగా ఇలాంటి కొత్త వైరస్లు ముందు కేరళలోనే బయటపడుతుంటాయి. ఎందుకంటే అక్కడి వాళ్లు ఎక్కువగా విదేశాలు, గల్ఫ్ దేశాల్లో పని చేస్తుంటారు. అక్కడి నుంచి కేరళకు వచ్చినప్పుడు వారికి వైరస్ సోకినట్లు చెప్తుంటారు. (China New Virus)