Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. విజయవాడ పుస్తక మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. తనకు పుస్తకాలు చదవడం అంటే ఎంత ఇష్టమో వెల్లడించారు. తనకు పుస్తకాలంటే ఎంత ఇష్టమో చెప్తూ.. కోటి రూపాయలు ఇవ్వడానికి వెనుకాడను కానీ పుస్తకం ఇవ్వడానికి ఆలోచిస్తాను అన్నారు. తాను ఎవరికైనా ఒక పుస్తకాన్ని ఇవ్వాలి అంటే అది తన సంపదను ఇచ్చినట్లే అని భావిస్తానని అన్నారు. కర్ణుడు కవచ కుండలాలను కోసేస్తే ఎలా బాధపడతాడో తెలీదు కానీ.. నా పుస్తకం ఇవ్వాలంటే కింద, మీద పడిపోతాను. ఇంటర్ చదువుకోలేక నేను ఆపలేదు. నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో, క్లాస్ రూంలో లేదు. అందుకే ఆపేసాను . రవీంద్రనాథ్ ఠాగూర్ స్కూలుకి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని చదువుకున్నాడు. నేను ఠాగూర్ గారి ప్రేరణతో ఆయన లాగే చెట్లు, మొక్కలు చూస్తూ పుస్తకాలు పెట్టుకొని ఉండిపోయాను అని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన మెగాస్టార్ ది లెజెండ్ అనే పుస్తకాన్ని పట్టుకుని పోజిస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
పవన్కు పుస్తకాలు చదవడం ఒక వ్యసనం. అంతేకాదు అది ఒక మార్గదర్శకం అని చెప్తుంటారు. వ్యక్తిత్వ వికాసం, స్ఫూర్తిదాయక ఆలోచనల కోసం పవన్ కళ్యాణ్ అనేక రంగాల పుస్తకాలపై అధ్యయనం చేస్తుంటారు. ఎన్నికలకు ముందు కూడా పవన్ వివిధ పుస్తకాలు చదువుతున్నట్లు ఫోటోలు బయటికి రావడంతో ఆయనపై ప్రతిపక్షాలు, ఆయనంటే గిట్టని కొందరు నెటిజన్లు తెగ సెటైర్లు వేసారు. ఎన్నికల సమయం కాబట్టి ఆయన ఏదో పెద్ద మహా పురుషుడైనట్లు బిల్డప్ ఇస్తున్నారు అనుకున్నారు కానీ ఆయన చిన్నతనంలోనే పుస్తకాలపై మక్కువను పెంచుకున్నారు. జీవితంలో వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొనడంలో, మనశ్శాంతిని పొందడంలో, పుస్తకాలు ఒక మిత్రుల్లా వ్యవహరిస్తాయని ఆయన ఎప్పుడూ చెప్తుండేవారు. ఆధ్యాత్మికత, రాజకీయ దృక్పథం, సామాజిక సమానత్వం వంటి అంశాలపై ఆయన పరిశోధనాత్మకమైన పఠనం చేస్తారు. (Pawan Kalyan)
పవన్ కళ్యాణ్ పఠనంలో ఆధ్యాత్మిక గ్రంథాలు, జీవిత చరిత్రలు, తాత్విక విషయాలు, రాజకీయ సాహిత్యం వంటి అంశాలు ప్రధానంగా ఉంటాయి. స్వామి వివేకానంద రచనలపై ఆయనకు ప్రత్యేకమైన మక్కువ ఉంది. వివేకానంద ఆశయాలు, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే విధానం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంపై ఎంతో ప్రభావం చూపించాయి. మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహనీయుల జీవితాలను ప్రతిబింబించే పుస్తకాలు ఆయనకు ఆదర్శంగా నిలిచాయి. కేవలం భారతీయ సాహిత్యం మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన రచనలు కూడా ఆయన పఠనంలో భాగంగా ఉన్నాయి. రష్యన్ రచయితలైన లియో టోల్స్టాయ్, డోస్తోయేవ్స్కీ రచనలు పవన్కు మరీ ప్రత్యేకం.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించడానికి ముందు, అనేక రాజకీయ గ్రంథాలను పరిశీలించారు. ప్రజా సంక్షేమం, సమాజంలో మార్పు తీసుకురావడం వంటి అంశాలపై ఆయనకు పుస్తకాలు చాలా విషయాలను నేర్పాయి. ప్రజల కోసం సేవ చేయాలంటే ముందు తన ఆలోచనలను ప్రభావవంతంగా తీర్చిదిద్దుకోవాలన్నది ఆయన నమ్మకం. తన పుస్తక పఠనాల గురించి పవన్ కళ్యాణ్ పలు ఇంటర్వ్యూలలో పంచుకోవడం ద్వారా యువతకు ప్రేరణ అందిస్తున్నారు. జీవితంలో విజయం సాధించాలంటే చదువుకోగలిగే గుణం ప్రతి ఒక్కరికి అవసరమని ఆయన అభిప్రాయపడతారు. పుస్తకాల ద్వారా వచ్చిన జ్ఞానమే ఆయనను ఒక స్పష్టమైన నాయకుడిగా మలచిందని అభిమానులు చెబుతారు. (Pawan Kalyan)