RK Roja: పీఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేయడంతో కూటమి డర్టీ పాలిటిక్స్ బయటపడిందని మరోసారి రచ్చకెక్కారు వైసీపీ నేత ఆర్కే రోజా. ఇలా తప్పుడు సాక్ష్యాలు పుట్టించి పార్టీ నేతలను, క్రమశిక్షణగా పనిచేసిన పోలీసులను అరెస్ట్ చేయిస్తే ప్రజలు చీపుర్లు, చెప్పులతో కొడతారని అన్నారు. అసలు చంద్రబాబు నాయుడు వారానికి ఒకసారి హైదరాబాద్ వెళ్తున్నారని.. ఆయన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రో లేక తెలంగాణకు ముఖ్యమంత్రో అర్థంకావడం లేదని ఏకిపారేసారు.
ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా కోర్టుల్లోనే తేల్చుకుంటాం. మేం అధికారంలోకి వచ్చాక మీరు మాత్రం తప్పించుకోలేరు. ఎందుకంటే కోర్టులకు తెలుసు మీరు చేసిన అక్రమాలు ఏంటని. కాబట్టి మీరు మాత్రం జైళ్లల్లో కూర్చోవడం గ్యారెంటీ. అమరావతి అనేది అన్ని వర్గాల వారికి సంబంధించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఓసీలు అందరూ ఉండాల్సిన రాజధాని అయినప్పుడు ఎందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చిన 50 వేల ఎకరాలను రద్దు చేసారని ప్రశ్నిస్తున్నా.
అంటే.. వీళ్లకి అహంకారం. చంద్రబాబు నాయుడు, ఆయన కులం, బినామీలు తప్ప ఎవ్వరూ ఉండకూడదా? ఎలా మీరు పేదవాళ్లకి ఇచ్చిన 50 వేల ఎకరాలని రద్దు చేసారని నేను అడుగుతున్నా. నాకు వాచీ లేదు, నాకు ఉంగరం లేదు అని బీద ఏడుపులు ఏడిచే మీరు ఎలా రిచెస్ట ముఖ్యమంత్రిగా ఉన్నారు? ఈరోజు అదే ఐదెకరాల భూమిని దాదాపు రూ.170 కోట్ల ఎలా కొన్నారు?
జనాలందరికీ తెలుసు. ఈరోజు ఎక్కడా భూమి ఎంత పోతుందో సాధారణ వ్యక్తులను అడిగినా చెప్తారు. నాలుగోసారి సీఎం అయ్యారు. మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసినా కుప్పంలో ఎందుకు ఇళ్లు కట్టుకోలేదు? విజయవాడలో ఎందుకు ఇళ్లు కట్టలేదు? మాట్లాడితే జగన్ బెంగళూరుకు వెళ్తున్నాడు అని అంటున్నారు. అధికారంలో ఉన్న మీరు హైదరాబాద్కి వెళ్లి కాపురాలు చేస్తే కరెక్ట్. ప్రతిపక్షంలో ఉన్న నేతలు మాత్రం నియోజకవర్గాల్లోనే ఉండాలా?
జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడే ఉండి పరిపాలన చేసారు. నేరుగా బటన్లు నొక్కి ఎలాంటి నేరాలు జరగకుండా వారి ఖాతాల్లో డబ్బులు పడేలా చేసారు. ఇప్పుడు నువ్వు, నీ కొడుకు, పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి వస్తున్నారు? వారం వారం హైదరాబాద్ వెళ్తున్నారు. నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రివా ఆంధ్రప్రదేశ్కా? మొన్న వరదలు వచ్చినప్పుడు ఇక్కడ ఉండి పరిపాలన చేసుంటే ఆ రోజు నీ ఇల్లు వరదల్లో మునిగిపోయేది కాదు కదా. అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు రోజా.