Narasimha Jayanthi: నరసింహ స్వామి అవతారమే విచిత్రమైనది. సింహం ముఖం, మానవ రూపంలో ఉంటారాయన. ఇలాంటి రూపంలో.. అంటే నరమృగ రూపంలో ఉన్న దైవాన్ని పూజిస్తే వెంటనే ప్రసన్నమవుతారట. ఉదాహరణకు వరాహ స్వామి, వినాయకుడు, హనుమంతుడు, హయగ్రీవుడు.. ఇలాంటి దేవుళ్లు మృగాకారం, మానవాకారం ఉన్నవారు. అందులోనూ నరసింహ స్వామిని క్షిప్ర ప్రసాదుడు అనే మరో పేరు ఉంది. అంటే అతి త్వరగా ప్రసన్నుడై కోరికలు నెరవేర్చే వారిలో ఈయనది ప్రథమ స్థానం అని చెప్తారు.
అయితే.. నరసింహ స్వామి అనగానే మనకు గుర్తొచ్చేది సింహం. కానీ విష్ణు మూర్తి ఈ అవతారమే ఎందుకు ఎత్తారు? సింహమే కాకుండా ఇంకా చాలా జంతువులు ఉన్నాయి కదా..! దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి.. సింహం అడవికి రాజు కాబట్టి ఆ అవతారాన్ని ఎంచుకున్నారు అని కొందరి వాదన. మరో కారణం ఏంటంటే.. ఇతరత్రా జంతువులు ఎలా అంటే.. ఉదాహరణకు పులినే తీసుకుందాం. పులికి ఆకలేస్తే దాని చుట్టూ ఏ రకమైన జంతువు ఉన్నా దాన్ని వెంటాడి తినేస్తుంది. కానీ సింహం అలా కాదు.
దానికి ఎంత ఆకలి ఉందో అంతటి జంతువునే ఎంచుకుంటుంది. అంతకంటే ఎక్కువ, తక్కువ జంతువులను పట్టించుకోదు. తన కళ్ల ముందు తిరుగుతున్నా వేటాడదు. విష్ణు మూర్తి హిరణ్య కశ్యపుడిని సంహరించేందుకు నారసింహావతారం ఎత్తారు. ఆయన అవతరించినప్పుడు చుట్టూ దేవతలు కూడా ఉన్నారు. కానీ నారసింహుడు ఇతరత్రా దేవతలను పట్టించుకోకుండా తన టార్గెట్ ఎవరైతే ఉన్నారో (హిరణ్య కశ్యపుడు) ఆయన్నే సంహరించేసాడు. అందుకే ఈ కలియుగంలో నారసింహుడిని పూజిస్తే మనకుండే శత్రు బాధ, దుష్ట ప్రయోగాలు తొలగిపోతాయి. (Narasimha Jayanthi)
నారసింహ జయంతి రోజున ఆయన వ్రతం చేయించుకుంటే ఎంతో మంచిది. నరసింహ స్వామి ఉపాసకుల చేత ఈ వ్రతాన్ని చేయించుకునేందుకు ప్రయత్నించండి. మీ జీవితంలో వచ్చే మార్పులు మీకే తెలుస్తాయి. ఈ వ్రతం చేయలేని వారు చేసే వారి వద్దకు వెళ్లి వ్రతం వీక్షించి, స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించినా అంతే అనుగ్రహం కలుగుతుంది. యుగాల్లో కూడా మొదటి అవతారం ఈయనదే. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం.. ఇలా ఈ నాలుగు యుగాల్లో కూడా మొదటి యుగానికి అంటే కృతయుగానికి ప్రధాన దైవం నరసింహస్వామే అని చెప్తారు.
త్యాగరాజ స్వామి రాముల వారి విగ్రహాల కోసం వెతుకుతుంటే అవి దొరక్కుండా మాయం చేసేయాలని ఆయన వదిన, అన్న విగ్రహాలను నదిలో పారేసి కుట్రలు పన్నినప్పుడు.. త్యాగరాజ స్వామి తిండి లేకుండా తన రామయ్య విగ్రమం కోసం వెతికారు. ఎక్కడా రాముల వారి విగ్రహం దొరక్కపోవడంతో ఓ నది ఒడ్డున కూర్చుని నా రామయ్య కనిపించడం లేదు అని తన బాధను నరసింహ స్వామిని వేడుకోవడంతో ఆయన వెంటనే అనుగ్రహించి నదిలో రాముల వారి విగ్రహాలు తేలుతూ బయటికి వచ్చాయి. అలా త్యాగరాజస్వామి నారసింహుడికి కృతజ్ఞతలు చెప్పుకుని రాములవారి విగ్రహాలను తీసుకుని వెళ్లి పూజించుకున్నారు. నరసింహ స్వామి ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా పూజిస్తే ఆయన అనుగ్రహం ఎల్లప్పుడూ మనమీద ఉంటుంది. మనకు 32 రకాల నరసింహ స్వామి విగ్రహాలు ఉన్నాయి. వీరిలో ఎవర్ని పూజించినా అంతా శుభమే. (Narasimha Jayanthi)