Allu Ayaan Letter to Allu Arjun ఒక వ్యక్తి జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఎంత సంపాదించినా తన బిడ్డలకు మాత్రం భుజాలపై మోసి పెంచిన ఓ సాధారణ తండ్రే. బిడ్డలు ఎంతో సాధిస్తూ తమ కళ్ల ముందే ఎదుగుతుంటే చూసి తరించిపోయే తల్లిదండ్రులను చూసాం. కానీ ఇక్కడ బిడ్డే తన తండ్రిని శెభాష్ నాన్నా అంటూ ఓ ఎమోషనల్ లేఖ రాసాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ పుష్ప 2 సినిమా రేపు రిలీజ్ అవుతున్న సందర్భంగా తన తండ్రికి ఓ లేఖ రాసాడు. ఆ లేఖను అల్లు అర్జున్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ.. తనకెంతో ఆనందాన్నిచ్చింది అని మురిసిపోయారు.
అయాన్ ఏం రాసాడు?
ప్రియమైన నాన్నా..
మీరు జీవితంలో అందుకున్న సక్సెస్, ఫెయిల్యూర్స్, డెడికేషన్ మిమ్మల్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టినప్పుడు నేను ఎంత సంతోషిస్తానో ఎంత గర్వపడతానో మాటల్లో చెప్పలేను. అందులే ఈ లేఖ రాస్తున్నాను. ఈరోజు ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ప్రపంచంలోనే ఒక గొప్ప సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సమయంలో మీ మదిలో ఎన్నో భావోద్వేగాలు ఉంటాయని తెలుసు. ఈ సందర్భంగా మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. పుష్ప 2 అనేది కేవలం ఒక సినిమా కాదు. నటన, సినిమా పట్ల మీకున్న ప్రేమ, డెడికేషన్కు నిదర్శనం. ఈ సందర్భంగా మీకు పుష్ప 2 టీంకు నా విషెస్ చెప్పాలనుకుంటున్నాను. సినిమా ఎలా ఉన్నా కూడా మీరు ఎప్పటికీ నా ఫేవరేట్ హీరోనే. మీకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఎప్పటికీ అలాగే ఉంటారు. ఎంత మంది అభిమానులు ఉన్నా మీ నెంబర్ 1 అభిమానిని ఎప్పటికీ నేనే నాన్నా.
పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైరు.. !
ఇట్లు
మీ ప్రియమైన బుజ్జి బాబు
ఇలా అయాన్ ఓ పేపర్పై రాసిన లేఖను తన తండ్రికి చూపించడంతో బన్నీ ఉప్పొంగిపోతూ నా కొడుకు ఈ లెటర్ రాసారంటూ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసారు.
ఇలాంటి లేఖను అయాన్ పుష్ప రిలీజ్ సమయంలో రాసుంటే బాగుండేది. ఇప్పుడు రాయడంతో అదేదో కావాలనే అల్లు అర్జున్ తన కుమారుడు రాసినట్లుగా పోస్ట్ చేసారేమో అనే సందేహం కలుగుతోందంటూ కొందరు హేటర్స్ కామెంట్స్ పెడుతున్నారు. బన్నీ విషయంలో మెగా ఫ్యామిలీ విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో అల్లు అర్జున జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్కు కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నంద్యాల తరఫున బరిలోకి దిగిన తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి తరఫున ప్రచారం చేయడం వివాదాస్పదంగా మారింది. ఫ్రెండ్ కోసం వెళ్తే తప్పేముంది అని అల్లు అర్జున్ అనుకున్నారు. కానీ ఆయన అనుకున్నది ఒకటి అయినదొక్కటి.
మెగా ఫ్యామిలీకి చెందిన సాయి ధరమ్ తేజ్ ఏకంగా బన్నీని ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో అవడం.. మనతో ఉంటూ శత్రువులకు సాయం చేసేవాడు పరాయివాడు అంటూ నాగబాబు ట్వీట్ చేయడం.. ఒకప్పుడు హీరోలు ఎర్రచందనం అడవులను కాపాడేవారు ఇప్పుడు వారే నరికేస్తూ స్మగ్లింగ్ చేస్తున్నట్లు సినిమాలు చేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ అనడం.. ఇలా చాలా రచ్చే జరిగింది. దాంతో మెగా అభిమానులు బన్నీపై విపరీతమైన కోపాన్ని పెంచేసుకున్నారు. ఆయనపై నీచంగా ట్రోలింగ్స్, కామెంట్స్ పెట్టారు. దీనిపై ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ క్లారిటీ ఇస్తూ వచ్చినా మంట చల్లారలేదు. దాంతో అయాన్ లేఖ రాసాడు అంటూ ఆయన సింపతీ కొట్టేయాలని అనుకుంటున్నాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.