Nandamuri Mokshagna Aditya 999 నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమా అప్పట్లోనే ఒక ఊపు ఊపేసింది. అప్పటికి సినిమా అంటే ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగించే విషయం. తెరపై అలా ఎలా నటిస్తారు.. తెరపైకి ఆ దృశ్యాలను ఎలా తీసుకువస్తారు ఇలా ఎన్నో విషయాలు వారికి అప్పటికి తెలీదు. అలాంటి సమయంలో సైన్స్ ఫిక్షన్ అంటూ ఆదిత్య 369 అనే అద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయడం అంటే మాటలు కాదు.
1991లో సింగీతం శ్రీనివాస్ రావుకి ఇలాంటి ఒక సినిమాను ప్రేక్షకులకు అందించాలన్న ఆలోచన కలిగింది. బాలకృష్ణ, మోహిని హీరో హీరోయిన్లుగా నటించారు. అమ్రిష్ పురి, టిన్నూ ఆనంద్, సుత్తివేలు కీలక పాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇక జంధ్యాల అందించిన మాటలు వర్ణణాతీతం. అప్పట్లో ఈ సినిమా చిత్ర పరిశ్రమను ఒక ఊపు ఊపేసింది. రోజుకో కొత్త రకం టెక్నాలజీ పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో.. ఇప్పటి తరం వారికి ఆదిత్య 369 సినిమా చూపించినా నోరెళ్లబెట్టుకుని చూస్తారు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
Nandamuri Mokshagna Aditya 999 ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. ఆదిత్య 999 టైటిల్తో ఈ సినిమాను తానే నిర్మించి దర్శకత్వం వహించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు బాలయ్య. ఇందులో హీరోగా తన కుమారుడు నందమూరి మోక్షజ్ఞ నటించనున్నాడు. ఈ సినిమా తనకు అర్థమైనట్లు ఎవ్వరూ తీయలేరని భావించిన బాలయ్య తన కుమారుడి సినీ కెరీర్ విషయంలో రిస్క్ తీసుకోదలచుకోలేదు. అందుకే ఈ సినిమాను వేరే దర్శకుడికి కానీ నిర్మాతకు కానీ అప్పగించాలనుకోలేదు. అన్ని బాధ్యతలు తానే తీసుకోవాలని అనుకున్నారు. ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అన్నీ కుదిరితే 2025 ఫిబ్రవరి నుంచి షూటింగ్ పనులు జరిగే అవకాశం ఉంది. ఇంకా హీరోయిన్ ఎవరు అనేది క్లారిటీ రాలేదు. ఈసారి కాస్త ఫ్రెష్ ఫేస్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మోక్షజ్ఞ తన కెరీర్ కొత్తలోనే తండ్రి దర్శకత్వంలో నటించబోతుండడం విశేషం.
ఇప్పుడు మోక్షజ్ఞతో చేయబోతున్న ఆదిత్య 999 సినిమాకి ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్ అనుకుంటున్నారట. అలాగని ఇందులో మొత్తం మోక్షజ్ఞ కనిపించడు. బాలయ్య కూడా కొత్త అవతారంలో కనిపించనున్నారు. ఈ సందర్భంగా బాలయ్య ఓ ఇంట్రెస్టింగ్ ఫోటోను రిలీజ్ చేసారు. దాంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఆదిత్య 999తోనే జరగాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ప్రశాంత్ వర్మ తీస్తున్న సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నారు. దాంతో ఇక రెండో సినిమాగా అయినా తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య 369 సీక్వెల్ అయ్యుండాలని బాలయ్య గట్టిగా నిర్ణయించేసుకున్నారు.
బడ్జెట్ ఎంత?
ఆదిత్య 369 సినిమాని అప్పట్లోనే రూ.1.52 కోట్లతో తీసారు. అప్పట్లో రూ.1.52 కోట్లు అంటే ఇప్పుడు దాదాపు రూ.12 కోట్లతో సమానం. కేవలం సినిమాకు సంబంధించిన ఫోటోగ్రఫీకే 110 రోజులు పట్టింది. ఇప్పుడు బాలయ్య భారీ బడ్జెట్ పెట్టి తీయాలని అనుకుంటున్నారు. ఎక్కడా కూడా రాజీ పడకుండా తన కుమారుడితో కలిసి చేయబోయే సినిమా ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉండాలని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.