Adnan Sami: త్వరలో పాకిస్థాన్ ఆర్మీ తన పట్ల వ్యవహరించిన వివరాలన్నీ బయటపెడతానని అన్నారు ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ. అద్నాన్ పాకిస్థాన్లోని పెషావర్లో జన్మించినప్పటికీ 2016లో ఆయన పాక్ పౌరసత్వాన్ని వదిలి భారతీయ పౌరసత్వం పొందారు. అద్నాన్ తండ్రి పాకిస్థానీ. తల్లి మాత్రం భారతీయురాలే. ఆయన 2001 నుంచి భారత్లోనే స్థిరపడ్డారు. అయితే.. నిన్న అద్నాన్ తన కుటుంబంతో కలిసి విహారయాత్ర నిమిత్తం అజర్బైజాన్ రాజధాని బాకుకి వెళ్లారు.
అక్కడ కొందరు పాకిస్థానీ కుర్రాళ్లు గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరించారు. అప్పుడు వాళ్లు తనతో ఓ మాటన్నారట. సర్.. మీరు పాకిస్థాన్ వదిలేసి మంచి పని చేసారు. మేం కూడా పాక్ పౌరసత్వం వదులుకోవాలని అనుకుంటున్నాం. మాకు పాక్ ఆర్మీ అంటే అసహ్యం వేస్తోంది. పాక్ ఆర్మీనే దేశాన్ని పాతాళంలోకి నెట్టేసింది అన్నారట. ఇది విని అద్నాన్ వారితో.. నాకు ఈ విషయం ఎప్పుడో అర్థమైంది కాబట్టే త్వరగా పాక్ నుంచి భారత్ వెళ్లిపోయాను అని వారితో చెప్పినట్లు అద్నాన్ ట్వీట్ చేసారు.
అయితే.. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన భీకర ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇక్కడ నివసిస్తున్న పాకిస్థానీయులను వెంటనే దేశం వీడి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్కి చెందిన ఫవాద్ చౌదరి అనే రాజకీయ నాయకుడు మరి అద్నాన్ సమీ మాటేంటి? అంటూ భారత్ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసారు. దీనికి అద్నాన్ సమాధానం ఇస్తూ.. ఈ చదువుకోని వెధవకి ఎలా సమాధానం చెప్పాలి. వీడు గతంలో సమాచార వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసాడు. కానీ తప్పుడు సమాచార వ్యవహారాల శాఖ మంత్రి అని ఈ ట్వీట్తో అర్థమైంది అంటూ చురకలంటించారు.
తనకు పాకిస్థాన్ ప్రజలతో ఎలాంటి ఇబ్బంది లేదని అక్కడి ప్రభుత్వం, ఆర్మీతోనే ఇబ్బంది అని తెలిపారు. తాను పాక్లో ఉన్నప్పుడు ఆర్మీ తన పట్ల ఎలా ప్రవర్తించిందో అన్ని వివరాలు త్వరలో బయటపెడతానని.. అది విని చాలా మంది షాక్కి గురవుతారని తెలిపారు.