Manchu Family Fight – మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) కుటుంబంలో జరుగుతున్న ఆస్తుల వివాదం ఓ కొలిక్కి వచ్చినట్లే అని తెలుస్తోంది. మోహన్ బాబుకి.. ఇద్దరు కుమారులు మంచు విష్ణు (Manchu Vishnu), మంచు మనోజ్.. (Manchu Manoj) కూతురు మంచు లక్ష్మీ ప్రసన్న (Manchu Lakshmi Prasanna) ఆస్తుల విషయంలో ఓ డీల్కి వచ్చారని తెలుస్తోంది. ఇప్పటికే మంచు ఇంటి పరువు బజారుకు వచ్చింది. నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. దాంతో పరువు కంటే ఆస్తి ముఖ్యం కాదు అనుకుని రాజీకి వచ్చారట. మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్, లక్ష్మీలు కాకుండా ఇంట్లోని కుటుంబ పెద్దల సమక్షంలో కూర్చుని మాట్లాడుకోవాలనుకున్నారట. ఏ ఆస్తి ఎవరికి ఇవ్వాలి అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. మోహన్ బాబు చాలా కాలం క్రితమే ముగ్గురు పిల్లలకు సమానంగా ఆస్తులు పంచేసారు.
అయితే మనోజ్ మరికొన్ని ఆస్తులు తనకు వస్తాయంటూ కొంతకాలంగా ఇంట్లో వారితో చర్చలు జరుపుతున్నారట. ముందు మనోజ్ తన తండ్రితో అన్నతో ఈ విషయం గురించి చర్చించగా.. ఏదో సరదాగా అంటున్నాడేమో అనుకున్నారు. కానీ అదే సమయంలో మనోజ్ భూమా మౌనికా రెడ్డిని పెళ్లి చేసుకోవడంతో ఆస్తుల వివాదం మరింత ముదిరింది. ఇప్పుడు ఏకంగా ఒకరిపై ఒకరు చేయి చేసుకునే వరకు వచ్చింది. సాధారణంగా ఇంట్లో సమస్యలు ఇంట్లో వారు పరిష్కరించుకోవాలి. కొట్టుకున్నా తిట్టుకున్నా మనలో మనమే అన్నట్లు ఉండాలి. కానీ మోహన్ బాబు తన అసిస్టెంట్ చేత మనోజ్ ఇంటి సీసీ కెమెరాలు దొంగిలించేలా చేయడం.. బౌన్సర్ల చేత కొట్టించడంతో వివాదం మరింత ముదిరింది. ఇక ఇప్పుడు మీడియా మంచు ఇంట రచ్చ అంటూ రోజుకో టాపిక్ గురించి డిబేట్లు డిస్కషన్లు పెడుతుండటంతో ఇలా కాకుండా సామరస్యంగా పరిష్కరించేసుకోవాలని అనుకుంటున్నారు. మనోజ్ అడిగినట్లు ఆస్తుల పంపకాల్లో కీలక మార్పులు చేయనున్నారు. విద్యానికేతన్ సంస్థలు.. హైదరాబాద్లో మోహన్ బాబుకి చెందిన కొన్ని భూములను మనోజ్కు వచ్చేలా మార్పులు చేయనున్నారట.

Manchu Family Fight అయితే మోహన్ బాబు కాస్త తగ్గుతున్నప్పటికీ విష్ణు మాత్రం మనోజ్ విషయంలో అస్సలు తగ్గడంలేదట. దాంతో మంచు లక్ష్మీ చెప్తే వింటాడని ఆవిడ ద్వారా విష్ణుని ఒప్పించేందుకు చర్చలు జరుగుతున్నాయి. అందుకే కొంతకాలంగా ముంబైలో నివాసం ఉంటున్న లక్ష్మీ ఈ గొడవ గురించి తెలుసుకుని హుటాహుటిన హైదరాబాద్కు చేరుకున్నారు. రెండు రోజులుగా విష్ణుతోనే ఉంటూ అతనికి నచ్చజెప్తున్న లక్ష్మీ మొత్తానికి అనుకున్నది సాధించినట్లుంది. అందుకే ఇన్స్టాగ్రామ్లో పీస్ (శాంతి) అంటూ ఓ పోస్ట్ పెట్టింది.
ఇంకా హాస్పిటల్లోనే పెద్దాయన
మోహన్ బాబు నిన్న మీడియా వారిపై దాడి చేయడంతో ఆయన బీపీ స్థాయులు పెరిగిపోయాయి. దాంతో వెంటనే విష్ణు కాంటినెంటల్ హాస్పిటల్లో చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి కాస్త కుదుటపడిందని వైద్యులు చెప్తున్నారు. అయితే నిన్న ఆయన్ను హాస్పిటల్కు తీసుకువచ్చినప్పుడే హై బీపీతో ఉన్నారని.. చాలా కన్ఫ్యూజన్లో ఎమోషనల్గా ఉన్నారని తెలిపారు. రెండు రోజుల పాటు ఆయనకు చికిత్స అవసరం ఉందని ప్రమాదం ఏమీ లేదని వైద్యులు తెలిపారు.
హైకోర్టులో ఊరట
ఇదిలా ఉండగా.. మీడియాపై దాడి చేసిన మోహన్ బాబుపై నిన్న కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఈరోజు మోహన్ బాబు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసారు. ఈ పిటిషన్ను విచారణ చేపట్టిన హైకోర్టు మోహన్ బాబుకి మద్దతుగా తీర్పు ఇచ్చింది. మోహన్ బాబు ఇంటి గొడవ కావడంతో పోలీసులు ఆయన ఇంటికి బందోబస్తు ఇవ్వాలని.. ఎప్పటికప్పుడు నిఘా వేసి ఉంచాలని పేర్కొంది.