Simhachalam Accident: సింహాచలం అప్పన్న ఆలయంలోని కొత్తగా నిర్మించిన గోడ కూలిపోవడంతో ఏకంగా ఎనిమిది మంది భక్తులు చనిపోయారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించడం.. వెంటనే హోంమంత్రి అనిత వంగలపూడిని పంపించి సహాయక చర్యలు జరిగేలా చేయడం వంటివన్నీ చేసారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే హిందువుల ప్రాణాలు పోతాయా?
ఈ మాటలు ఎవరో వైసీపీ నేతలు అంటున్నారు. కూటమి ప్రభుత్వం మీద మాజీ మంత్రి వేలంపల్లి శ్రీనివాస్ రావు సంచలన వ్యాఖ్యలు చేసారు. కూటమి ప్రభుత్వం వస్తే హిందూ భక్తులు చనిపోవడం అనేది ఒక ఆనవాయితీ అయిపోయిందని.. కూటమి ప్రభుత్వం హిందూ దేవాలయాలను, హిందువులను ఒక ఓటు బ్యాంక్ గానే చూస్తున్నారు తప్ప, దేవాలయాల పరిరక్షణలో గాని, అభివృద్ధిలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు.
ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రతిపక్ష, విపక్షాలు అధికారంలో ఉన్న పార్టీని మాటలు అనడం సహజమే. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే.. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ప్రమాదం జరిగినా దానికి కారణం గత పాలకులే అని అనేస్తున్నారు. ఇది ఎంత వరకు కరెక్ట్? సింహాచలం అప్పన్న ఆలయంలో కూలిన గోడను ఇటీవల చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే నిర్మించింది. ఇప్పుడు అదే గోడ కూలిపోయింది. ఇప్పుడు అది వర్షాలకు కూలిపోయిందని అనిత అన్నారు.
అయితే అది తాము నిర్మించిన గోడే అని కాకుండా.. గత పాలకులు ఏ కాంట్రాక్టర్ను నియమించి ఈ గోడను కట్టించారో విచారణ చేపట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అనడం సబబు కాదు. ఆ గోడ కట్టించింది వారే అనడానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. తమది నిజాయతీగా పనిచేసే ప్రభుత్వం అని పలుమార్లు చెప్పే అనిత.. ఇప్పుడు తమ ప్రభుత్వం వల్ల జరిగిన ఘోరానికి వైసీపీని అనడం ఎంత వరకు కరెక్ట్?