Jagtial: ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లే. ఒకరే కనీస జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తే.. మరొకరు తొందరపాటు నిర్ణయం తీసుకుని జీవితాల్ని నాశనం చేసుకున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన లక్ష్మీ ప్రసన్న(29)కు, వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామానికి చెందిన తిరుపతికి రెండేళ్ల కిందట వివాహం అయింది. ఇద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు.. ఏడాది కిందట వీరికి కొడుకు పుట్టాడు. అయితే తిరుపతి, లక్ష్మి ప్రసన్న చామనచాయ రంగులో ఉంటే కొడుకు తెల్లగా, అందంగా పుట్టాడని అనుమానం పెంచుకొని తిరుపతి భార్యను నిత్యం వేధించేవాడు. దీంతో లక్ష్మీ ప్రసన్న ఉద్యోగం కూడా మానేసి ఇంట్లోనే ఉండేది.
దీనికి తోడు కట్నం డబ్బు కూడా మొత్తం ఇవ్వలేదని కట్నం డబ్బులు కావాలని అత్తమామలు వేధించడంతో, లక్ష్మీ ప్రసన్న ఐదు రోజుల క్రితం జగిత్యాలలోని తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లింది. తీవ్ర వేధింపులకు గురైన లక్ష్మీ ప్రసన్న ఇంట్లో ఉన్న అద్దంపై ‘అమ్మా నాన్న నాకు బతకాలని లేదు. నా కొడుకు జాగ్రత్త. ప్లీజ్ వాళ్లకు మాత్రం నా బాబును ఇవ్వకండి’ అని రాసి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమ కూతురు చావుకు భర్త, అత్తమామలే కారణమని లక్ష్మీ ప్రసన్న తండ్రి ఫిర్యాదు చేయగా, తిరుపతి మరియు తిరుపతి తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు.