Pawan Kalyan: పెళ్లిళ్లు, పేరంటాలకు ఇంట్లో వారు కానీ పక్కింటి వారు కానీ రాకపోతే.. అదేంటండి రాలేదు అని అడిగి మరీ బాధపడుతుంటారు. ఊరికే ఫోన్ చేసి పిలిచారు కానీ.. శుభలేఖ, ఆహ్వానం వంటివి ఇవ్వలేదు. అందుకే రాలేదు అని చెప్తుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు.. పవన్కు ఎంతో గౌరవం ఇస్తారు. ఆయన హోదాకు తగ్గట్టు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని పునరుద్ధరణ చేయాలని ప్లాన్ చేసిన చంద్రబాబు ఈ కార్యక్రమానికి మే 2న శ్రీకారం చుట్టారు. ఈ వేడుకకు కూటమిలో భాగంగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. కార్యక్రమానికి తగ్గట్టు ఆహ్వానాలు కూడా సిద్ధం అయ్యాయి. అయితే ఆహ్వాన పత్రికలో ఎక్కడా పవన్ పేరు లేకపోవడం పలు సందేహాలకు దారి తీస్తోంది. పైగా ఇలాంటి ఘటనలు ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని వైసీపీ ఎదురుచూస్తుంటుంది. అనుకున్నట్లే ఆ పార్టీ నేత పేర్ని నాని చేతికి ఆహ్వానం అందింది. ఆ ఆహ్వానంలో పవన్ పేరు లేకపోవడంతో.. ఇక్కడ ఎవరో కనబడుట లేదనుకుంటా అంటూ వ్యంగ్యంగా సోషల్మీడియాలో కామెంట్ కూడా చేసారు.
ఇప్పుడు ఇదే విషయం గురించి తెలుగు దేశం పెద్దలను అడిగితే.. పవన్ వేరే చంద్రబాబు నాయుడు వేరు కాదు. చంద్రబాబు పవన్ను ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం లేదు. ప్రతి కార్యక్రమంలో ఆయన ఉండి తీరాల్సిందే. అందుకే ఆయన పేరును ఆహ్వాన పత్రికలో వేయించలేదు అని చెప్తారు. అలా కుదరదు కదా..! పవన్ను పర్సనల్గా ఆహ్వానించడం వేరు.. కొందరి నోటికి తాళం వేసేలా ఆహ్వాన పత్రికల్లో పేరు వేయించడం వేరు. తెలుగు దేశం పార్టీ ఇలాంటి పనులు చేసి అనవసరంగా వైసీపీకి అవకాశం ఇస్తున్నట్లుగా అనిపిస్తోందని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు.