Osama Bin Laden: సరిగ్గా 14 ఏళ్ల క్రితం ఇదే రోజున మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్ను అమెరికా మట్టుబెట్టిన సంఘటనని ఎవ్వరూ మర్చిపోలేరు. అమెరికన్ ట్విన్ టవర్స్ పేల్చివేతలో లాడెన్ కీలక సూత్రధారి. దాంతో లాడెన్ను ముక్కలు ముక్కలు నరకాలని అమెరికా నడుం బిగించింది. 9/11 దాడి జరిగిన తర్వాత లాడెన్ను అంతమొందించేందుకు అమెరికాకి దాదాపు పదేళ్లు పట్టింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నేతృత్వంలో ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ పేరిట బలగాలను మోహరించి లాడెన్ను అంతమొందించింది.
పాకిస్థాన్లోని అబోట్టాబాద్లో లాడెన్ ఉన్నాడని తెలిసి అమెరికా కూంబింగ్ చేపట్టింది. భారీ ప్రహరీ గోడలు, నెట్వర్క్ లేని బిల్డింగ్ని చూసి అమెరికాకు అనుమానం వచ్చింది. ఇంత పకడ్బందీగా అంత పెద్ద కాంపౌండ్ వాల్స్ కట్టించుకుని మరీ ఉన్నారంటే ఖచ్చితంగా లాడెన్ అందులోనే ఉండి ఉంటాడని తెలిసి దాడులు చేసింది. అలా లాడెన్ పీడను వదిలించింది. లాడెన్ చచ్చాడు.. న్యాయం జరిగింది అని ఒబామా మీడియా ద్వారా అనౌన్స్ చేయగానే అమెరికాతో పాటు ఉగ్రవాదం వల్ల అల్లాడిపోతున్న ఎన్నో దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి.
అయితే లాడెన్ బాడీ ఏమైనట్లు? చాలా మంది లాడెన్ను కాకుండా వేరొకరిని చంపి లాడెన్ని అంతమొందించామని అమెరికా చెప్తోందని కొన్ని దేశాలు అనుమానాలు వ్యక్తం చేసాయి. వాటిని అమెరికా తోసిపుచ్చుతూ.. లాడెన్ కుటుంబీకుల డీఎన్ఏతో పరీక్షలు నిర్వహించిన తర్వాతే లాడెన్ చనిపోయాడని ప్రకటించామని తెలిపింది. ఆ తర్వాత లాడెన్ మృతదేహాన్ని 12 గంటల తర్వాత ఓ తెల్లటి గుడ్డలో కప్పి USS కార్ల్ విన్సన్ అనే అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్లో ఎక్కించి అరేబియన్ మహాసముద్రంలో పడేసారు. అతని అంత్యక్రియలు ఇస్లాం పద్ధతుల్లోనే జరిపించారు. అయితే లాడెన్ను సముద్రంలో ఎందుకు పడేసారు అన్న ప్రశ్నకు అమెరికా రెండు సమాధానాలు చెప్పింది. ఒకటి.. లాడెన్ మృతదేహాన్ని పాతిపెడితే ఆ సమాధిని పవిత్రమైనది అంటూ దర్గాలు కట్టేస్తారని.. రెండోది ఏంటంటే.. అతన్ని పాతిపెట్టేందుకు సరైన స్థలం కావాలని ఇతర దేశాలతో చర్చలు జరిపేంత సమయం లేదని అమెరికా తెలిపింది.
అయితే.. అమెరికాకి చెందిన ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సైమోర్ హర్ష్ ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. లాడెన్ మృతదేహాన్ని పలుమార్లు తుపాకీతో కాల్చి ఆ ముక్కలను హిందూ ఖుష్ పర్వతాల్లో పడేసారని అన్నాడు. దీనిపై అమెరికా మండిపడింది. ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్లో పాల్గొన్న SEAL బృందం తమలో తాము మాట్లాడుకుంటుంటే తన స్నేహితుడు ఒకడు విన్నాడని హర్ష్ తెలిపాడు. అందులో ఎలాంటి వాస్తవం లేదని అమెరికా స్పష్టం చేసింది.