Money Tips In Telugu ఈ భూమి మీద ఉన్న ప్రతీ మనిషి బతికేది డబ్బు కోసమే. డబ్బే సర్వస్వం కాదు అని నీతులు చెప్పే వారే డబ్బు కోసం వెంపర్లాడుతుంటారు. డబ్బు ఉంటే ప్రతీదీ సాధ్యమే. నిజమేనా? మరి అలాంటి డబ్బు రెట్టింపు అవ్వాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. అయితే మనీ టిప్స్ గురించి మనకు చాలా మంది చాలా రకాలుగా చెప్తుంటారు. అలా చేయండి ఇలా చేయండి.
కొందరైతే యాలకులు తలగడ కింద పెట్టుకుంటే డబ్బులు వస్తాయని.. పర్సుల్లో బీరువాల్లో పెట్టుకుంటే కోట్లు కుమ్మరిస్తాయని అర్థం పర్థం లేని విషయాలను చెప్తుంటారు. ఇవన్నీ వినడానికి మీమ్స్ రూపంలో షేర్ చేసుకోవడానికి బాగుంటాయి. ఇలా రకరకాల మనుషులు చెప్పిన విషయాలను విన్నామంటే ఇక అంతే సంగతులు. మరి మనీ టిప్స్ ఎవరు చెప్తే వినాలి? అనుకుంటున్నారా? ఎవరో ఏంటి.. స్వయంగా లక్ష్మీదేవే చెప్పింది. లక్ష్మీదేవే ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలగడానికి ఓ ఉపాయం చెప్పిందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ..! ఇంతకీ ఆ ఉపాయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
లక్ష్మీ దేవి ఇచ్చిన టిప్
మీరు ఎప్పుడైనా వ్యాపారస్తులు డబ్బులు లెక్కపెట్టేటప్పుడు ఒకటి.. రెండు.. మూడు అని కాకుండా లాభం.. రెండు.. మూడు అని లెక్కపెట్టడం చూసారా? డబ్బు విషయంలోనే కాదు.. బియ్యం, పప్పులు ఇలా ఏవైనా కొలిచేటప్పుడు కూడా లాభం.. రెండు.. మూడు అని కొలుస్తుంటారు. అంతేకానీ ఎప్పుడూ ఒకటి.. రెండు.. మూడు అని అనరు. ఇలా ఒకటి అనే పదాన్ని వాడకపోవడం వెనుక ఓ కథ ఉంది. ఇలా లెక్కపెడితే లాభం బాగా వస్తుందట. ఇలా లాభం.. రెండు. మూడు అని లెక్క పెట్టే వ్యాపారులు లక్ష్మీపుత్రుల్లా కళకళలాడిపోతుంటారు.
ఆ కథేంటి?
Money Tips In Telugu వాసవీ అమ్మవారు జగజ్జననీ.. మానవ అవతారంలో భూమి మీదకు వచ్చి మన మధ్యే తిరిగే అమ్మవారు. ఈ అమ్మవారు పెనుగొండలో ఉండేవారు. ఒకసారి.. ఒక రాజు ఆ అమ్మవారి మీద కన్నేసాడు. దాంతో ఆ తల్లి ఆ రాజుకి నేను దక్కను అని చెప్పి ఆత్మార్పణం చేసుకుంది. అప్పుడు ఆ అమ్మవారితో పాటు 102 గోత్రాల వారు కూడా అమ్మా నువ్వు కంకణం కట్టుకున్నట్లే మేమూ దీక్షా కంకణం కట్టుకుని ఆత్మార్పణం చేసుకుంటాం అన్నారు. అందులో మొట్ట మొదట ముందుకు వచ్చింది లాభారీయుడు అనే యువకుడు. అతను అమ్మా నేనూ నా భార్య కూడా నీతో పాటు ఆత్మార్పణం చేసుకుంటాం అని చెప్తాడు. అప్పుడు అమ్మవారు నవ్వి.. నాయనా ఈ మిగతా 101 కుటుంబాల వారు కూడా వయసు పైబడిన వారు.. కానీ నువ్వు ఇటీవల పెళ్లి చేసుకున్నావ్.. నీ భార్య కాళ్ల పారాణి కూడా ఇంకా ఆరలేదు. నువ్వెందుకు ఆత్మార్పణం చేసుకోవడం అని ప్రశ్నించింది.
అప్పుడు లాభరీయుడు అమ్మవారితో ఇలా అంటాడు. అమ్మా.. నీతో పాటు అగ్నిలో దూకడం అంటే బాధెలా అవుతుంది? అది కైలాసానికి వెళ్లినంత సంతోషం తల్లీ. దయచేసి నా అనుమతి ఇవ్వమ్మా అని కాళ్ల మీద పడి ప్రాథేయపడ్డాడు. అప్పుడు అమ్మవారు పొంగిపోయి సరే అంటుంది. అతను కూడా తన భార్యతో దీక్షా కంకణం ధరించి అమ్మవారి తర్వాత అగ్నిలోకి దూకేసారు. అప్పుడు అమ్మవారు పొంగిపోయి ఒక మాటిచ్చింది. నాయనా.. మొట్టమొదటి వాడికింద దూకడానికి నువ్వు ముందుకొచ్చావు కాబట్టి.. ఇక నుంచి నీ పేరులోని లాభం అనేది ఒకటి అనే పదానికి పర్యాయపదంగా ఉంటుంది.. అందుకే ధనాన్ని లెక్కపెట్టేటప్పుడు ఒకటి రెండు మూడు అని కాకుండా లాభం.. రెండు.. మూడు అని లెక్కపెట్టడానికి ధన, ధాన్య సమృద్ధి కలుగుతాయి అని అనుగ్రహిస్తుంది. ఆ తర్వాత సాంప్రదాయాన్ని పాటించి ఎప్పుడు బియ్యం కొలిచినా.. డబ్బు లెక్క పెట్టినా లాభం.. రెండు.. మూడు అని అంటున్నారు.
అయితే ఈ మధ్యకాలంలో ఇలా లాభం.. రెండు.. మూడు అని లెక్కపెట్టేవారే కనుమరుగైపోయారు. అదేదో నామోషీ కింద భావిస్తున్నారు. సాక్షాత్తు అమ్మవారు ఇచ్చిన మనీ టిప్ని మనం కూడా పాటించాల్సిందే. అమ్మ చెప్పింది అంటే అనుగ్రహించి తీరుతుంది అని గుర్తుపెట్టుకోండి.