Marakata Lingam
దర్శనాత్ అభ్ర సదాశి
జననాత్ కమలాలయే
స్మరణాత్ అరుణాచలే
కాశ్యాంతు మరణాన్ముక్తిః
ఈ పై శ్లోకం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ శ్లోకం అర్థం ఏంటంటే.. చిదంబరాన్ని దర్శించినా.. అరుణాచలాన్ని స్మరించినా.. కమలాలయంలో జన్మించినా.. కాశీలో మరణించినా తప్పకుండా వారికి ముక్తి కలుగుతుంది. అన్నీ సరే కానీ కమలాలయంలో పుట్టడం ఏంటి? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఈరోజు ఈ కమలాలయం గురించి.. మన భూమి నుంచి ఇంద్రుడు పట్టుకెళ్లిపోయిన శివలింగం గురించి తెలుసుకుందాం.
కమలాలయం అంటే ఏంటి?
తమిళనాడులోని తిరువారూరు అనే ప్రాంతం ఉంది. ఇది కుంభకోణానికి 42 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఉన్న పరమేశ్వరుడిని త్యాగరాజ స్వామి అని పిలుస్తారు. త్యాగరాజ స్వామిని దర్శనం చేసుకుని అక్కడ ఊర్లో పుడితేనే ముక్తి అని పై శ్లోకంలో చెప్పారు. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే.. తిరువాయూర్ అనే ఒక ప్రాంతం ఉంది. అది తంజావూర్కి దగ్గర్లో ఉంది. వాగ్గేయకారులు త్యాగరాజ స్వాములు ఉన్నారు కదా.. అందుకే పొరపాటున త్యాగరాజ స్వామి తిరువాయూరు పేర్లు చూసి అది కమలాలయం అనుకుంటున్నారు. కానే కాదు. ఈ కమలాలయం తిరువారూరులో ఉంది. ఇది కుంభకోణం దగ్గర ఉంది. ఈ క్షేత్రం గురించి పురాణాల్లో ఏం చెప్పారంటే..ఒళ్లంతా విబూది పూసుకుని మూడు రోజలు అక్కడ నిద్ర చేయగలిగితే ఎంత ఘోరమైన పాపం చేసినా పరమేశ్వరుడు దాని నుంచి బయటికి తీసుకొస్తాడట. అక్కడున్న శివుడిని సోమాస్కంద మూర్తి అంటారు. చాలా అపురూపమైన మూర్తి ఇది. ఈ మూర్తి మనకు కైలాసంలో కనిపిస్తుంది. అలాంటి సోమాస్కంద మూర్తి భూమి మీదకు వచ్చింది.
సోమాస్కంద మూర్తి ప్రత్యేకత ఏంటి?
ఈ సోమాస్కంద మూర్తి ప్రత్యేకతకు ఓ ఆసక్తికరమైన కథ ఉంది. ఒకసారి ఏమైందంటే.. కొంతమంది రాక్షసులు విజృంభించి లోక కంఠకులుగా తయారైతే అప్పుడు అందరూ వేడుకుంటే విష్ణుమూర్తి ఎలాగైనా నేను వారిని సంహరించి వస్తాను అని చెప్పి కిందికి వచ్చాడు. చక్ర ప్రయోగం చేసి ఒక్కొక్కరిని సంహరిస్తుంటే ఇద్దరు రాక్షసులు భృగు మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. ఆ ఆశ్రమంలో మహర్షి భార్య ఉంది. అమ్మా శరణు శరణు అంటూ ఆవిడ నుంచి అభయం తీసుకున్నారు ఆ ఇద్దరు రాక్షసులు. మమ్మల్ని విష్ణుమూర్తి తరుముకుంటూ వస్తున్నాడు నువ్వు మమ్మల్ని దాచిపెట్టు అని అడగ్గా అందుకు ఆమె ఒప్పుకుంటుంది. అదే ఆశ్రమంలో చోటిస్తుంది.
ఈలోగా విష్ణుమూర్తి వచ్చి ఆ ఇద్దరు రాక్షసులు ఏరి అని అడిగారు. ఆ ఇద్దరూ నా సంరక్షణలో ఉన్నారు. వారిని చంపడానికి వీల్లేదు. వారిని చంపాలంటే ముందు నన్ను చంపాలని అని ఆవిడ విష్ణుమూర్తితో అంటుంది. అది విన్న విష్ణువు.. వారు లోక కంఠకులు వారి వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారిని చంపాల్సిందే నువ్వు తప్పుకో అంటాడు. అందుకు ఆమె ససేమిరా అంటుంది. వాళ్లని సంహరించాలంటే ముందు నన్ను చంపు అంటుంది. ఇక చేసేదేమీ లేక ఆవిడని చంపి ఆ ఇద్దరు రాక్షసులను కూడా సంహరించేసాడు. ఆ తర్వాత ఆయన వైకుంఠానికి వెళ్లిపోయారు.
వెళ్లిన దగ్గర్నుంచి ఆయనకు విపరీతమైన బాధ ఉండేది. ఎందుకంటే ఒకటి.. రుషి పత్నిని సంహరించడం.. అంతకన్నా ముఖ్యంగా ఆ సమయంలో ఆవిడ గర్భవతి. దాంతో విష్ణుమూర్తి అంతటాయన కూడా అల్లాడిపోయాడు. అప్పుడు లక్ష్మీదేవి ఆయన బాధ చూడలేక భూమి మీదకు వచ్చి ఒక చోట ఘోర తపస్సు చేసింది. ఆ తపస్సు చేసిన ప్రదేశమే ఈ కమలాలయం. ఆఖరికి ఆ తపస్సుని మెచ్చి పరమేశ్వరుడు పార్వతి దేవి సోమాస్కంద మూర్తి స్వరూపంలో దర్శనమిచ్చారు. ఏంటా సోమాస్కంద మూర్తి అంటే.. సోమా అంటే సా + ఉమ.. అంటే ఉమాదేవితో కలిసిన పరమేశ్వరుడు.. వారితో పాటు స్కందుడుగా ఉన్న మూర్తి. వారు వచ్చి ఒక మరకత లింగం స్వరూపంలో అక్కడ సాక్షాత్కరించి ఉద్భవించారు. ఆ మరకత లింగంలో ఉమాదేవి, పరమేశ్వరుడు, స్కందుడు ఉన్నాయి.
మనకు అర్థనారీశ్వరుడు ఎంత శక్తిమంతమైనవాడో సోమాస్కందుడు కూడా అంతే. అప్పుడు మహావిష్ణువు కిందకి దిగి వచ్చి 12 కోట్ల సార్లు ఆ మరకత లింగానికి అభిషేకం చేసాడు. అప్పుడు ఆయన పాపం పోయింది. ఆ తర్వాత భృగు మహర్షి కూడా మృత సంజీవని వచ్చు కాబట్టి తన భార్యను తిరిగి బతికించుకున్నాడు. అదంతా సుఖాంతం అయ్యింది. ఇక్కడ మహా విష్ణువు అంతటి మహానుభావుడికి పాపం తగలడం ఏంటి? అనే సందేహం మీకు రావచ్చు. దీనికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే.. ఆ ప్రదేశాన్ని పునీతం చేయడం. ఆ ప్రదేశంలో లక్ష్మీ దేవి తపస్సు చేయగా.. విష్ణుమూర్తి వచ్చి 12 కోట్ల సార్లు మరకత లింగానికి అభిషేకం చేసాడు.. శివుడు పార్వతి దేవి కుమార స్వామి ముగ్గురూ మరకత లింగ స్వరూపులుగా వెలిసారు. ఇంతకన్నా శక్తి ఏముంటుంది చెప్పండి. మనకు చరిత్ర తెలీదు కాబట్టి ఎప్పుడూ వెళ్లలేదు కానీ.. లేకపోతే కమలాలయానికి జీవితంలో ఒకసారైనా వెళ్లాల్సిందే. అంత గొప్ప ప్రదేశం.
ఇక రెండో కారణం ఏంటంటే.. శివకేశవులు అభేదాన్ని తెలియజేయడం. ఇక్కడ విష్ణు మూర్తికి పాపం వస్తే పరమేశ్వరుడు వచ్చి తీర్చాడు. అలాగే మరో కథలో విష్ణు మూర్తికి అవసరం అయితే శివయ్య దాసుడి కింద వెళ్తాడు. పరమేశ్వరుడికి పిల్లలు కావాలంటే పార్వతి దేవి నారాయణ మంత్రం చేసి వినాయకుడిని కంది. విష్ణువుకి పిల్లలు కావాలంటే పరమేశ్వరుడిని పూజించి సాంబుడిని కన్నారు. ఇవన్నీ చూస్తే శివకేశవులు ఇద్దరూ శక్తిమంతులే కదా..! వారిద్దరూ ఒక్కటే. మనకు తెలీకుండా అనవసరంగా మూర్ఖత్వంలో పడిపోయి ఒకరిని ఆదరించి ఒకరిని ధూషిస్తుంటారు. ఇద్దరూ ఒకటే స్వరూపాలు. అది చెప్పడానికి ఈ కమలాలయం వెలిసింది.
ఆ మరకత లింగం ఏమైంది?
అయితే.. ఆ మరకత లింగాన్ని తర్వాత ఇంద్రుడు తీసుకెళ్లిపోయాడు. అలాంటి లింగం స్వర్గంలో ఉంటే బాగుంటుందని అక్కడ పెట్టుకుని పూజించుకునేవాడు. భూమి మీద పరమేశ్వర శక్తి రావాలని మరకత లింగం వెలిసింది. ఇంద్రుడు ఆ లింగాన్ని ఎత్తుకెళ్లిపోయాడు. మరి ఆ లింగం భూమి మీదకు మళ్లీ ఎలా వచ్చిందో తెలుసా? పరమేశ్వరుడు ఇంకో నాటకం ఆడాడు. ఒకసారి కైలాసంలో అమ్మవారు కూర్చుని ఉంటే పరమేశ్వరుడు ఆవిడ ఒడిలో నిద్రిస్తూ ఆవిడతో ముచ్చటిస్తుండగా.. పక్కనే బిల్వ వృక్షం ఉంది. ఆ చెట్టుపై ఓ కోతి ఉంది. ఆకులను తుంపి కిందకు వేసింది. సరిగ్గా ఆ ఆకులు పరమేశ్వరుడి పాదాల మీద పడ్డాయి. మామూలుగా ఒక రాతి శివలింగానికే మనం అర్చన చేస్తేనే ఆయన మనకు ఏం కావాలన్నా ఇస్తాడు. అలాంటిది ఆ కోతి సాక్షాత్తు పరమేశ్వరుడి పాదాలపై బిల్వ పత్రాన్ని వేస్తే ఇక ఆ కోతి జీవితం ధన్యమైపోదూ..!
వెంటనే ఆ పరమేశ్వరుడు కోతి భక్తిని మెచ్చి భూలోకంలో గొప్ప చక్రవర్తివై పుడతావు అని ఆశీర్వదించాడు. ఆ కోతి నాకు ఆ వరం వద్దు అంటుంది. అదేంటి అని పరమేశ్వరుడు అడగ్గా.. ఎవడికి కావాలి స్వామి ఆ రాజ్యాలు.. ఇక్కడ నీ సన్నిధిలో నిన్ను అమ్మను చూసుకుంటున్నాను హాయిగా.. ఇది వదిలేసి ఆ రాజ్యంలో నాకేం పని అంటుంది. అప్పుడు స్వామి సంతోషించి నాయనా.. నీ వల్ల ఒక మంచి కార్యం జరగాలి అందుకే కిందకి వెళ్లి రా అని చెప్పి పంపుతాడు. ఆ కోతి కిందకు వచ్చి ముచికుందుడు అనే ద్రవిడ దేశంలో రాజుగా పుట్టి.. ధర్మాత్ముడిగా మహా శివభక్తుడిగా మారతాడు. ఒకసారి ఇంద్రుడుకి అసురులపై యుద్ధం చేయడానికి అవసరమై ముచికుందుడిని తీసుకెళ్లి వెళ్తాడు.
రాజు సాయం చేసాడు. చివరికి యుద్ధంలో గెలిచాడు. ఆ తర్వాత ఇంద్రుడు ఆయనకు ఓ వరం ఇచ్చాడు. సన్మానం చేసి స్వర్గంలో ఉన్న ఏదైనా కోరుకో అన్నాడు. అప్పుడు ఆ రాజు నాకు మరకత లింగం కావాలి అని అడుగుతాడు. దాంతో ఇంద్రుడు బాధపడతాడు. సరే అని చెప్పి రెండు రోజుల్లో మంచి ముహూర్తం వస్తుంది కాబట్టి అప్పుడు లింగాన్ని తీసుకెళ్లండి అని చెప్తాడు. ఈలోగా దేవ శిల్పి విశ్వ కర్మను పిలిపించి ఇదే మరకత లింగంలా మరో నకలు తయారు చేయాలని చెప్తాడు. ఆయన ఐదు నిమిషాల్లో చెక్కేస్తాడు. ఆ రాజుకి నకిలీ లింగం ఇస్తాడు. ఆయన మహా సంబరపడిపోయి ఒక చోట ప్రతిష్ఠించుకుని పూజించుకుంటాడు.
ఎన్ని పూజలు చేసినా ఆ విగ్రహంలో కళ రావడంలేదు అని బాధపడతాడు. నా పూజలో భక్తి లేదేమో అంటూ బాధపడుతుంటాడు. అప్పుడు పరమేశ్వరుడు కలలో కనిపించి నాయనా నీ భక్తిలో ఎలాంటి లోటు లేదు. ఇంద్రుడు నీకు అసలైన విగ్రహం ఇవ్వకుండా నకలు ఇచ్చాడు అని చెప్తాడు. దాంతో రాజుకు కోపం వచ్చి వెంటనే ఇంద్రుడు దగ్గరికి వెళ్లి నన్ను మోసం చేస్తావా అని తిడతాడు. అప్పుడు ఇంద్రుడు ఇదే అసలైన లింగం అంటూ ఐదు సార్లు మోసం చేస్తాడు. దాంతో ఆ రాజుకి ఒళ్లు మండిపోతుంది. ఏవిటి ఇంద్రా నీ అహంకారం? నీకు యుద్ధంలో సాయం చేస్తే నన్ను మోసం చేస్తావా అని మండిపడతాడు. అప్పుడు ఇంద్రుడు అసలైన లింగాన్ని ఇచ్చేస్తాడు. దానినే రాజు కిందకి తెచ్చాడు. అదే తిరువారూరులో ఉన్న మరకత లింగం. ఇంతటి శక్తిమంతమై లింగాన్ని వీలైతే మీరు కూడా దర్శించుకోండి.