Harish Rao: చివరికి పాకిస్థాన్కి అయినా అప్పు పుడుతోంది కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నమ్మి ఎవ్వరూ కూడా అప్పు ఇచ్చేందుకు ముందకు రావడం లేదని అన్నారు BRS నేత హరీష్ రావు. తమ ప్రభుత్వంలో ఒక్క కిలో వడ్లు కూడా తరుగు తియ్యం అని రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పాడని… ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో జెట్టి రాజు అనే కౌలు రైతు క్వింటాకు 10 కేజీల వడ్లు తరుగు తీస్తున్నారని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని అన్నారు. తాలు, తరుగుల పేరు మీద రాష్ట్రంలో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. అందాల పోటీలకు సంబంధించి పోలీసులను వారి పని వారిని చేసుకోనివ్వకుండా రేవంత్ కమాండ్ కంట్రోల్ రూం నుంచి రివ్యూలు చేస్తున్నారని.. అందాల రాశులకు ఇచ్చిన విలువ ధాన్యం రాశులకు ఇవ్వడం లేదని అన్నారు.
అందాల పోటీల్లో పాల్గొనే అమ్మాయిలు హైదరాబాద్కు వచ్చారని.. అందాల భామలకు కుక్కలు కనబడకుండా కుక్కలను ఎత్తుకు పోయి చంపుతున్నారు.. కాని దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం రివ్యూ చేయడానికి కనీస సమయం లేదని సెటైర్ వేసారు. వేలాది మంది పోలీసులను, ప్రభుత్వ అధికారులను నియమించి అందాల రాశులకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నాడు కానీ రైతుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని అన్నారు. తాను పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. తాను ఇప్పటికే చాలా సార్లు చెప్పానని… ఎన్ని సార్లు అడిగినా కేసీఆర్ చెప్పింది తాను తూ.చా. తప్పకుండా పాటిస్తానని అన్నారు. కేటీఆర్ గారికి నాయకత్వం అప్పగిస్తే నేను తప్పకుండా స్వాగతిస్తానని.. ఒక కార్యకర్తగా పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పడు శిరసావహిస్తానని అన్నారు.