RK Roja: సంధ్య థియేటర్ ఘటనలో రేవతి అనే మహిళ తొక్కిసలాటలో చనిపోతే అల్లు అర్జున్కి (Allu Arjun) మానవత్వం లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పెద్ద నీతులు చెప్పారని.. మరి గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇద్దరు అభిమానులు చనిపోతే వారిని పలకరించని పవన్కు మానవత్వం ఉందా అని ప్రశ్నించారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత రోజా. తిరుపతిలో మూడు రోజుల క్రితం వైకుంఠ ఏకాదశి టోకెన్ల పంపిణీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృత్యువాతపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి మూడు రోజులు అవుతున్నా కూడా ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలా రావుతో పాటు నిర్లక్ష్యంగా వ్యహరించినవారిపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు రోజా.
అల్లు అర్జున్కి మానవత్వం లేదన్నావ్గా
పుష్ప 2 రిలీజ్ రోజున హైదరాబాద్లోని సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబాన్ని అల్లు అర్జున్ పరామర్శించలేదని.. మానవత్వం మరిచి గోటితో పోయే దానికి గొడ్డలి దాకా తెచ్చుకున్నారని పవన్ ఆనాడు వ్యాఖ్యలు చేసారు. అయితే.. గేమ్ ఛేంజర్ ఈవెంట్కి వచ్చిన పవన్ అభిమానుల్లో ఇద్దరు చనిపోతే వారి కుటుంబాలను పవన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. వారి కుటుంబాలను తన కార్యక్రమానికి పిలిపించుకున్న పవన్ కనీసం పలకరించకుండా వారిని అవమానించారని ఆరోపించారు. అల్లు అర్జున్కి మానవత్వం లేదన్న పవన్కు మానవత్వం సిగ్గు రెండూ లేవని అన్నారు. (RK Roja)
ఏ1గా చంద్రబాబును చేర్చాలి
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో చంద్రబాబు నాయుడుని ఏ1గా చేర్చాలని రోజా డిమాండ్ చేసారు. క్షతగాత్రులను పరామర్శించడానికి హాస్పిటల్కి వెళ్లిన చంద్రబాబు నాయుడు.. ఈ టోకెన్ల జారీ ప్రక్రియను గత ప్రభుత్వం ప్రవేశపెట్టిందమ్మా అని అన్నాడని.. మరి ఆ టోకెన్ల ప్రక్రియ అనేది తప్పైతే అధికారంలోకి వచ్చాక ఎందుకు దానిని రద్దు చేయకుండా కొనసాగించారని నిలదీసారు. ఆ టోకెన్ల ప్రక్రియ ఉన్నప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో ఎప్పుడూ ఇలాంటి ఘోరం జరిగింది లేదని.. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగిందంటే ముమ్మాటికీ ప్రభుత్వం చేతకానితనమే అని ఎద్దేవాచేసారు.
అసలు రోజాకి ప్రోటోకాల్ దర్శనం ఎలా?
ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా.. దర్శనం జరిగిన గంటకే ప్రెస్ మీట్ పెట్టి ప్రస్తుత ప్రభుత్వంపై ఎన్నో ఆరోపణలు చేసారు. ఇవన్నీ పక్కనపెడితే.. రోజాకు శ్రీవారి దర్శనానికి ప్రోటోకాల్ కల్పించింది. ఆమె ఇప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు కదా. మరి అలాంటప్పుడు వీఐపీ దర్శనానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఆ పర్మిషన్ని ఎవరు అంగీకరించినట్లు? అంటే తితిదేలో ఇంకా వైఎస్సార్ కాంగ్రెస్ కోసం పనిచేసేవారు ఉన్నారా? లేదంటే.. పోనీలే అని జాలితో రోజాకు దర్శనం ప్రోటోకాల్ కల్పించారా? దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలోనే చర్చ జరుగుతోంది. ప్రెస్ మీట్లు పెట్టి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం గత పాలనలో చేసిన తప్పులను ఎండగడుతూనే మళ్లీ ఆ పార్టీ నేతలకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారంటూ కూటమి మద్దతుదారులు మండిపడుతున్నారు. పైకి మాత్రమే అరుపులు.. లోపల అందరూ ఒక్కటే అనే మాట వినిపిస్తోంది. అనవసరంగా వీరి కోసం ప్రజలు కొట్టుకుంటున్నారని.. వీళ్లు మాత్రం బాగానే ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారని అంటున్నారు. (RK Roja)