Poonam Kaur: మరోసారి నటి పూనమ్ కౌర్.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ హాట్ టాపిక్గా మారింది. తన పట్ల త్రివిక్రమ్ చేసిన అన్యాయాన్ని మర్చిపోయే సమస్యే లేదని.. అతన్ని వదిలిపెట్టనని అన్నారు. ఆల్రెడీ తాను త్రివిక్రమ్ మీద ఫిర్యాదు చేస్తే.. మా అసోసియేషన్ సభ్యురాలిగా ఉన్న యాంకర్ ఝాన్సీ మీటింగ్ పెట్టినట్లే పెట్టి తర్వాత తాను బిజీగా ఉన్నానని.. డిస్టర్బ్ చేయొద్దని అన్నారని పోస్ట్లో పేర్కొన్నారు.
తాను ముందు నుంచి చెప్తున్నదే ఇప్పుడూ చెప్తున్నానని.. త్రివిక్రమ్ను రాజకీయంగా కొందరు, సినీ ఇండస్ట్రీ నుంచి మరికొందరు కాపాడుతున్నారని అన్నారు. కచ్చితంగా తాను మహిళా సంఘాల ద్వారా తేల్చుకుంటానని.. ఆల్రెడీ ఈ అంశంపై వారికి మెయిల్ పెట్టానని అన్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయంలో పూనమ్ కౌర్ కొన్ని సంవత్సరాల పాటు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి మోసం చేసాడని.. ఎన్నో సినిమాల్లో అవకాశాలు వస్తున్నా త్రివిక్రమ్ చివరి నిమిషంలో తనను తీయించేసాడని పూనమ్ వాపోయారు. అయితే.. త్రివిక్రమ్ గురించి ఆరోపణలు చేస్తున్న సమయంలో ఆమె గురూజీ అని సంబోధిస్తూ గతంలో ట్విటర్లో కామెంట్స్ పెట్టారు.
త్రివిక్రమ్ను ఇండస్ట్రీలో చాలా మంది గురూజీ అనే సంబోధిస్తారు. దాంతో పూనమ్ త్రివిక్రమ్ గురించే మాట్లాడుతున్నారు అని అందరికీ అర్థం అయిపోయింది. దీని గురించి త్రివిక్రమ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆ తర్వాత మీటూ ఉద్యమం మొదలైనప్పుడు మరోసారి పూనమ్ ఈ టాపిక్ లేవనెత్తారు. ఆ సమయంలో ఏకంగా త్రివిక్రమ్ పేరును నేరుగా ప్రస్తావించేసారు. దాంతో పెద్ద రచ్చకు దారి తీసింది. అప్పుడు కూడా త్రివిక్రమ్ స్పందించలేదు.
ఎందుకంటే పూనమ్ అప్పుడప్పడు వచ్చి సోషల్ మీడియాలో త్రివిక్రమ్ గురించి హంగామా చేసి వెళ్లిపోతున్నారే తప్ప తన దగ్గర ఆధారాలుంటే ఎందుకు బయటపెట్టడం లేదు అని చాలా మంది అడుగుతున్న ప్రశ్న. దాంతో ఆమె పట్ల చాలా మందిలో విశ్వసనీయత తగ్గింది. ఇటీవల దర్శకుడు గీతా కృష్ణ పూనమ్ గురించి.. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పూనమ్ చెప్పేవి నిజమే అని.. కాకపోతే ఆమె అప్పుడప్పుడూ సోషల్ మీడియాలోకి వచ్చి మాట్లాడే బదులు ఆధారాలతో ఒకేసారి పోరాడితే న్యాయం జరుగుతుంది కదా అన్నారు. బహశా.. అందుకే పూనమ్ ఈరోజు ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించినట్లున్నారు.