Nita Ambani: రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani), నీతా అంబానీ దంపతులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతి ముఖ్యమైన వ్యక్తులతో మంచి పరిచయాలు ఉన్నాయి. ఒక దేశ అధ్యక్షుడు, ప్రధాని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా లేని పరిచయాలు అంబానీలకు ఉన్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. మొన్న అగ్రరాజ్యం అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గెలిచిన సంగతి తెలిసిందే.
ఈ నెల 20న ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ట్రంప్ అమెరికాకు రెండోసారి అధ్యక్షుడు కాబోతున్నాడు. అమెరికాకు ఆయన 47వ అధ్యక్షుడు. ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్ నుంచి అంబానీ దంపతులు వెళ్లనున్నారు. వారి కోసం ప్రత్యేక సీటింగ్ అరేంజ్మెంట్లు చేసారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు రోజు రాత్రి అంబానీ దంపతులు ట్రంప్తో కలిసి ప్రైవేట్ డిన్నర్ చేయనున్నారు. ఈ డిన్నర్ ఈవెంట్లో ట్రంప్తో ఆయన సతీమణి మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్, ఆయన సతీమణి ఉషా కూడా పాల్గొననున్నారు. (Nita Ambani)
సాధారణంగా ట్రంప్తో డిన్నర్ చేయాలంటే అందరికీ సాధ్యం కాదు. ట్రంప్ ఎన్నికల ప్రచారానికి మిలియన్ డాలర్లలో నిధులు కేటాయించినవారికే ఈ అవకాశం ఉంటుంది. మరి అంబానీలకు ఈ డిన్నర్లో పాల్గొనే అవకాశం వచ్చింది అంటే కచ్చితంగా వారు ఫండ్స్ ఇచ్చే ఉంటారు. ఇంతకీ ట్రంప్ ప్రచార కార్యక్రమాలకు అంబానీ ఎంత వెచ్చించారంటే.. దాదాపు 2 మిలియన్ డాలర్లు అనే టాక్ నడుస్తోంది. ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ బ్లాక్ టై అనే కార్యక్రమాన్ని హోస్ట్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కూడా అంబానీ దంపతులు హాజరుకానున్నారు. భారత ప్రభుత్వం నుంచి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లనున్నారు. ట్రంప్కి మంచి మిత్రుడైన భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ప్రత్యేక ఆహ్వానం అందింది. అయితే ఆయన ఇతర పనుల్లో బిజీగా ఉంటారని అందుకే వెళ్లడం లేదనే టాక్ వినిపిస్తోంది.