Tarrif War: అమెరికా, చైనాల మధ్య ట్యారిఫ్ యుద్ధం ఇప్పుడిప్పుడే ముగిసేలా లేదు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పీఠాన్ని రెండోసారి అధిష్ఠించగానే పూనకాలు వచ్చేసినట్లు భారత్తో సహా చాలా దేశాలపై ట్యారిఫ్లను బాదేసాడు. వాటిలో చైనా కూడా ఉంది. అయితే.. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోవడం.. ఇతర దేశాలు గగ్గోలు పెడుతుండడంతో ట్రంప్ కాస్త దిగి వచ్చాడు.
90 రోజుల పాటు ఈ ట్యారిఫ్లు వర్తించవు అని ప్రకటిస్తూనే.. ఎవరిపైన అయినా జాలి చూపచ్చేమో కానీ చైనా మీద మాత్రం జాలి చూపించేదేలే అంటూ డబుల్ ట్యారిఫ్లు పెంచేసాడు. దాంతో చైనాకు ఒళ్లు మండింది. నువ్వు తగ్గనప్పుడు నేను మాత్రం ఎందుకు తగ్గాలి అన్న ధోరణిలో వ్యవహరిస్తోంది చైనా. అమెరికాకి చెందిన బోయింగ్ విమానాలకు సంబంధించి ఎలాంటి ఆర్డర్లు తీసుకోవద్దని చైనా తమ ఎయిర్లైన్స్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
ట్రంప్ చైనా వస్తువలపై 145% ట్యారిఫ్ను పెంచితే.. చైనా అమెరికా వస్తువులపై 125% ట్యారిఫ్లను పెంచింది. దీని వల్ల చైనాలో అమెరికాకి చెందిన విమానాలకు, వాటి భాగాలకు ధరలు ఆకాశాన్నంటుతాయి. విమానాలకు కావాల్సిన పరికరాలను కూడా అమెరికా నుంచి కొనుగోలు చేయొద్దని చైనా ప్రభుత్వం హెచ్చరించింది. ఎయిర్క్రాఫ్ట్ సేల్స్కి పెట్టింది పేరు చైనా. ఇప్పుడు చైనా అమెరికా ట్యారిఫ్లపై గుర్రుగా ఉంది. దాంతో ఇప్పుడు బాగా నష్టపోయేది బోయింగ్ విమానాలే.
2018లో 15% బోయింగ్ విమానాలు చైనాకు డెలివర్ అయ్యాయి. ఇటీవల కాలంలో బోయింగ్కు చైనా నుంచి ఎలాంటి ఆర్డర్లు లేవు. దాంతో బోయింగ్ ఉద్యోగులు కూడా అల్లాడిపోతున్నారు. ఇప్పుడు బోయింగ్ కాకుండా దానికి పోటీగా ఉన్న యూరోపియన్ సంస్థ ఎయిర్ బస్ నుంచి చైనా విమానాలు కొనుగోలు చేస్తోంది.