Thammareddy Bharadwaja: కొంతకాలంగా ప్రముఖ సింగింగ్ రియాల్టీ షో పాడుతా తీయగాలో జరుగుతున్న తతంగం గురించి గాయని ప్రవస్తి మీడియా ముందు షాకింగ్ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. పాడుతా తీయగా షోను నిజాయతీగా నిర్వహించడం లేదని.. తనను బాడీ షేమింగ్ చేసి, పొట్టి బట్టలు వేసుకోమనే వారని ప్రవస్తి తెలిపింది. ఒక కులం వారికే సపోర్ట్ చేస్తూ జడ్జిలు తీర్పు ఇచ్చేవారని.. అందుకే తనను షో నుంచి ఎలిమినేట్ చేసారంటూ చంద్రబోస్, కీరవాణి, సునీతలపై సంచలన ఆరోపణలు చేసింది.
దీనిపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఏ విషయం బయటికి వచ్చినా.. ఏ చర్చ జరిగినా తమ్మారెడ్డి మీడియా ముందుకు వచ్చి తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఉంటారు. ఇప్పుడు పాడుతా తీయగా విషయంలో ప్రవస్తి చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. పాడుతా తీయగా షోలో ఓ జడ్జి రాకపోతే తాను జడ్జిమెంట్ ఇవ్వడానికి వెళ్లానని.. కానీ ఒక కులం వారినే ప్రోత్సహిస్తారు అనేది అబద్ధమని అన్నారు. సునీత తొక్కేయాలని చూసింది అని ప్రవస్తి చెప్పిన దాంట్లో నిజం లేదని… ఇప్పుడు ఇండస్ట్రీలో సునీతకే దిక్కులేదని అన్నారు. ఒకప్పుడు నెలకు 15 పాటలు పాడే సునీత ఇప్పుడు సంవత్సరంలో 10 పాటలు పాడితే గొప్ప అన్నారు. అలాంటి సునీతకు ప్రవస్తిని తొక్కేస్తే ఏమొస్తుందని అన్నారు.
ఒకవేళ సునీత అంత పెద్ద స్థాయిలో ఉంటే మ్యూజిక్ డైరెక్టర్లకు ఫోన్ చేసి తనకు పాడే అవకాశం ఇవ్వండి అని అడుగుతుందే కానీ ప్రవస్తికి పాట ఇవ్వకండి అని ఎందుకు చెప్తుంది అని ప్రశ్నించారు. ఇక పొట్టి దుస్తుల విషయానికొస్తే.. అసలు తాను జడ్జిగా వెళ్లినప్పుడు చంకలు కనిపించేలా దుస్తులు వేసినా తాను ఒప్పుకునేవాడిని కాదని.. పాడుతా తీయగాలో అలాంటి దుస్తులు వేసుకునే వారు లేరని అన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉన్నప్పుడు పాడుతా తీయగా చాలా బాగుండేదని.. కానీ ఇది చారిటీ కార్యక్రమం కాదు కదా.. బిజినెస్ కాబట్టి ఎప్పటికప్పుడు ఛానెల్ వాళ్లు డబ్బుల కోసం మార్పులు చేసుకుంటూ ఉంటారని వెల్లడించారు.